బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం

  • పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతాలో అధికారికంగా ప్రకటించారు
  • భవానీపూర్‌లో మమతా బెనర్జీపై గెలిచిన సువేందుకే సీఎం పీఠం
  • రేపు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణస్వీకారం
  • ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సమాచారం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో శుక్రవారం జరిగిన బీజేపీ నూతన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించిన విషయం తెలిసిందే. మొత్తం 294 స్థానాలకు గాను 207 సీట్లు గెలుచుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక కోసం కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సహ పరిశీలకునిగా వ్యవహరించారు.

ఈ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ స్థానం నుంచి కూడా గెలుపొందారు. ముఖ్యంగా భవానీపూర్‌లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై 15 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం ఆయనకు కలిసొచ్చింది.

మే 9న కోల్‌కతాలోని ప్రసిద్ధ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. సువేందు అధికారి ఎన్నికతో రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Suvendu Adhikari
West Bengal
BJP
West Bengal Chief Minister
Mamata Banerjee
Nandigram
Bhabanipur
Amit Shah
West Bengal Election Result

More Telugu News